Viewing:

అపొస్తలుల కార్యములు Acts 17

Select a Chapter

తెస్సలోనిక సంఘ స్థాపన

1వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. 2పౌలు తన అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం మూడు విశ్రాంతి దినాలు లేఖనాల్లో నుండి వారితో తర్కించాడు. 3క్రీస్తు హింసలు అనుభవించి మృతుల్లో నుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. “నేను మీకు ప్రకటించే యేసే క్రీస్తు” అని తెలియజేశాడు.

4కొంతమంది యూదులు ఒప్పుకుని పౌలు సీలలతో కలిశారు. వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు.

యూదుల వ్యతిరేకత

5అయితే ఆ బోధను నమ్మని యూదులు అసూయతో నిండిపోయి, వ్యాపార వీధుల్లో తిరిగే కొంతమంది పోకిరీ వాళ్ళను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్ద అల్లరి సృష్టించారు. వారు యాసోను ఇంటి మీద దాడి చేసి, పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్ళాలనుకున్నారు.

6అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరులనూ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయి, “భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. 7వీరంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ సీజరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు. 8జనసమూహం అధికారులూ ఈ మాటలు విని ఆందోళనపడ్డారు. 9వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసుకుని వారిని విడుదల చేశారు.

బెరయాలో పరిచర్య

10సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు. 11వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు. 12అందుచేత వారిలో చాలామంది నమ్మారు. ప్రముఖ గ్రీకు స్త్రీలూ, పురుషులూ విశ్వసించారు.

13అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్కు ప్రకటిస్తున్నాడని తెస్సలోనికలోని యూదులు తెలుసుకుని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రెచ్చగొట్టి అల్లరి రేపారు. 14వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకూ పంపారు. సీల, తిమోతి, అక్కడే ఉండిపోయారు.

15పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకూ తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు.

ఏతెన్సులో పౌలు

16పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది. 17అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి ఆరాధించే వారితోనూ, వ్యాపార వీధుల్లో ప్రతి రోజూ వచ్చిపోయే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు.

18ఎపికూరీయుల స్తోయికుల వర్గానికి చెందిన కొంతమంది తత్వవేత్తలు అతనితో వాదించారు. కొంతమంది, “ఈ వాగుడుకాయ చెప్పేది ఏమిటి” అని చెప్పుకున్నారు. అతడు యేసుని గూర్చీ, చనిపోయిన వారు తిరిగి బ్రతకడం గూర్చీ ప్రకటించాడు కాబట్టి మరి కొంత మంది, “ఇతడు మనకు తెలియని దేవుళ్ళను ప్రచారం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు. 19వారు అతనిని వెంటబెట్టుకుని అరియోపగు అనే సమాఖ్య దగ్గరికి తీసుకుపోయి, “నీవు చెబుతున్న ఈ కొత్త బోధ మేము తెలుసుకోవచ్చా? 20నీవు కొన్ని వింత విషయాలు మాకు వినిపిస్తున్నావు. అందుచేత వీటి అర్థమేంటో మాకు తెలుసుకోవాలని ఉంది” అని చెప్పారు.

21ఏతెన్సు ప్రజలూ, అక్కడ నివసించే విదేశీయులూ ఏదో ఒక కొత్త విషయం చెప్పడంలో, వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.

అరియోపగు సభలో పౌలు ఉపన్యాసం

22పౌలు అరియోపగు సభనుద్దేశించి, “ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా మతభక్తి గలవారని నేను గమనిస్తున్నాను. 23నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను.

24విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. 25ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.

26ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,

28మనం ఆయనలో బతుకుతున్నాం,

ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి.

‘మనమాయన సంతానం,’

అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.

29కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.

30ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. 31ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”

32మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి ఎతెన్సు వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మరి కొంతమంది దీన్ని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు. 33ఆ తరువాత పౌలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు. 34అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరియోపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోబాటు మరి కొంతమంది కూడా ఉన్నారు.