Viewing:

నిర్గమ Exodus 30

Select a Chapter

పరిమళ ధూప వేదిక

నిర్గ 37:25-28

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ధూపం వేయడానికి తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెయ్యాలి. 2దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండాలి. అది చదరంగా ఉండాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. 3దాని లోపల, బయటా నాలుగు పక్కలా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాలి. దాని అంచును బంగారంతో అలంకరించాలి.

4దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు తగిలించి, ఒక వైపు రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి. 5తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాలి. 6వేదికను శాసనాల పెట్టెకు ముందు ఉన్న తెర బయట, శాసనాలపై ప్రాయశ్చిత్త స్థానం ఎదురుగా ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను.

7అహరోను ఆ వేదికపై పరిమళ ద్రవ్యాల ధూపం వెయ్యాలి. అతడు ప్రతిరోజూ ఉదయం దీపాలను సర్దే సమయంలో దాని మీద ధూపం వెయ్యాలి. 8అలాగే సాయంత్రాలు అహరోను దీపాలు వెలిగించే సమయంలో కూడా వేదికపై ధూపం వెయ్యాలి. యెహోవా సన్నిధిలో మీ తరతరాలకూ నిత్యంగా ఆ ధూపం ఉండాలి.

9దాని మీద నిషిద్ధమైన వేరే ధూపాలు వెయ్యకూడదు. హోమాన్ని గానీ, నైవేద్య ద్రవ్యాలను గానీ అర్పించకూడదు. పానార్పణలు అర్పించ కూడదు.

10అహరోను ఆ వేదిక కొమ్ముల మీద సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. పాప పరిహారార్థబలి రక్తంతో దాని కొమ్ముల కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మీ తరతరాలకూ సంవత్సరానికి ఒకసారి అతడు వేదిక కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అది యెహోవాకు అతి పవిత్రమైనదిగా ఉంటుంది.”

11యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు, 12“నువ్వు ఇశ్రాయేలు ప్రజల సంఖ్య లెక్కబెట్టాలి. వాళ్ళను లెక్కించే సమయానికి తమపై ఎలాంటి కీడు రాకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాణం కోసం విడుదల పరిహార ధనం యెహోవాకు చెల్లించాలి.

13జాబితాలో నమోదు అయిన ప్రతివాడూ అర తులం వెండి చెల్లించాలి. పవిత్ర స్థలం లెక్క చొప్పున పూర్తి బరువు ఇవ్వాలి. యెహోవాకు అర్పణగా దాన్ని చెల్లించాలి.

14ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళంతా జన సంఖ్యలో నమోదు కావాలి. జన సంఖ్యలో చేర్చే ప్రతి ఒక్కరూ యెహోవాకు అర్పణ చెల్లించాలి.

15విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి.

16ఇశ్రాయేలు ప్రజలు విడుదల పరిహార ధనంగా చెల్లించిన వెండిని సన్నిధి గుడారం సేవ కోసం ఉపయోగించాలి. అది ప్రాయశ్చిత్త పరిహారంగా ప్రజల పక్షంగా యెహోవా సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకార్ధంగా ఉంటుంది.”

ఇత్తడి గంగాళం

17యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు. “నువ్వు ఇత్తడితో ఒక గంగాళం సిద్ధం చేసి ఇత్తడి పీటపై ఉంచాలి. 18సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి. 19ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.

20వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు.

21వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.”

అభిషేక తైలం, ధూపద్రవ్యం

22యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు, 23“నువ్వు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని అభిషేకం చెయ్యాలి. పవిత్ర స్థలానికి సంబంధించిన కొలతల ప్రకారం స్వచ్ఛమైన గోపరసం 500 షెకెల్, సుగంధం గల దాల్చిన చెక్క సగం అంటే 250 షెకెల్, 24నిమ్మగడ్డి నూనె 250 షెకెల్, లవంగిపట్ట 500 షెకెల్, మూడు పాళ్ళు ఒలీవ నూనె తీసుకోవాలి. 25పరిమళ ద్రవ్యాలు మిళితం చేసే నిపుణుడైన పనివాడి చేత పరిమళ ద్రవ్యం సిద్ధపరచాలి. అది యెహోవాకు ప్రతిష్ఠి అభిషేక తైలం అవుతుంది.

26ఆ తైలంతో నువ్వు సన్నిధి గుడారాన్ని అభిషేకించాలి. దానితోపాటు సాక్ష్యపు గుడారాన్ని, 27సన్నిధి బల్లను, దాని సామగ్రిని, దీపస్తంభాన్ని, దాని సామగ్రిని, 28హోమ బలిపీఠాన్ని, దాని సామగ్రిని, గంగాళాన్ని, దాని పీటను అభిషేకించాలి. 29అవన్నీ అతి పవిత్రమైనవిగా ఉండేలా వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.

30అహరోను, అతని కొడుకులు నాకు యాజకులై నాకు సేవ చేసేలా వాళ్ళను అభిషేకించి ప్రతిష్ఠించాలి.

31నీవు ఇశ్రాయేలు ప్రజలతో, ‘ఇది మీ తరతరాలకు నాకు పవిత్ర అభిషేక తైలంగా ఉండాలి. 32దాన్ని యాజకులు కాని వాళ్ళ మీద పోయకూడదు. దాని పాళ్ళ ప్రకారం అలాంటి వేరే దాన్ని చెయ్యకూడదు. అది పవిత్రమైనది. దాన్ని మీరు పవిత్రంగా ఎంచాలి. 33దాని వంటి దాన్ని కలిపే వాణ్ణి గానీ, యాజకుడు కాని వారిపై దాన్ని చల్లే వాణ్ణి గానీ తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి’ అని చెప్పు.”

34యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు “నువ్వు జటామాంసి, గోపిచందనం, గంధం, సాంబ్రాణి సమపాళ్ళలో తీసుకుని వాటితో పరిమళ ద్రవ్యాలను, ధూపద్రవ్యం సిద్ధపరచాలి. 35పరిమళ ద్రవ్యాల నిపుణుడైన పనివాడు దాన్ని కలపాలి. దానికి ఉప్పు కలపాలి. ఆ ధూప మిబాధం స్వచ్ఛమైనదిగా, పవిత్రంగా ఉంటుంది.

36దానిలో కొంచెం పొడి తీసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధి గుడారంలో శాసనాల మందసం ఎదుట ఉంచాలి. మీరు దాన్ని పరిశుద్ధమైనదిగా భావించాలి.

37నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యాల వంటి ధూపాలను మీ కోసం కలుపుకోకూడదు. అది కేవలం యెహోవాకు ప్రత్యేకమైనది అని భావించాలి. 38దాని వాసన చూద్దామని అలాంటి దాన్ని తయారు చేసేవాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.”