Viewing:

యెహో Joshua 8

Select a Chapter

హాయి నగరం నాశనం

1కాబట్టి యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “భయపడకు, జడియకు, యుద్ధసన్నద్ధులైన వారినందరినీ తీసుకుని హాయి మీదికి వెళ్ళు. చూడూ, నేను హాయి రాజునూ, అతని ప్రజలనూ, అతని పట్టణాన్నీ, అతని దేశాన్నీ నీ చేతికప్పగించాను. 2నీవు యెరికోకూ, దాని రాజుకూ, ఏమి చేశావో అదే హాయికీ, దాని రాజుకూ చేస్తావు, అయితే దోపుడు సొమ్మునీ పశువులనూ మీరు బాగా దోచుకోవాలి. పట్టణపు పడమటి వైపు మాటుగాళ్ళను ఉంచు.” 3యెహోషువ, హాయి మీదికి వెళ్ళడానికి పరాక్రమవంతులైన ముప్ఫై వేల మంది శూరులను ఏర్పరచుకుని రాత్రివేళ వారిని పంపాడు.

4అతడు వారికిలా ఆజ్ఞాపించాడు. “ఈ పట్టణానికి పడమటి వైపున దాన్ని పట్టుకోడానికి మీరు పొంచి ఉండాలి, పట్టణానికి బాగా దూరం వెళ్ళిపోకుండా మీరు సిద్ధంగా ఉండాలి. 5నేనూ, నాతో కూడా ఉన్న ప్రజలంతా పట్టణానికి చేరుకుంటాం, వారు ఇంతకు ముందులాగా మమ్మల్ని ఎదుర్కోడానికి రాగానే మేము పారిపోతాం. 6ఇంతకు ముందులాగానే ‘వారు మన ముందు నిలవలేక పారిపోతున్నారు’ అనుకుని, వారు మా వెంటబడతారు, పట్టణం నుండి వారు బయటికి రాగానే 7మీరు పొంచి ఉన్న స్థలం నుండి లేచి పట్టణాన్ని పట్టుకోండి, మీ దేవుడు యెహోవా దాన్ని మీ చేతికి అప్పగిస్తాడు. 8మీరు ఆ పట్టణాన్ని పట్టుకొన్నప్పుడు యెహోవా మాట ప్రకారం దాన్ని తగలబెట్టాలి. ఇదే నేను మీకాజ్ఞాపిస్తున్నాను.”

9యెహోషువ వారిని పంపగా, వారు పొంచి ఉండటానికి హాయికి పడమటి దిక్కున బేతేలుకు, హాయికి మధ్య ఉన్న స్థలానికి వెళ్ళారు. ఆ రాత్రి యెహోషువ ప్రజల మధ్య బస చేశాడు. 10ఉదయమే యెహోషువ లేచి ప్రజలను వ్యూహంగా సమకూర్చి తానూ, ఇశ్రాయేలీయుల పెద్దలూ, ప్రజలకు ముందుగా పడమరగా ఉన్న హాయి మీదికి వెళ్ళారు. 11అతని దగ్గరున్న యోధులందరు ఆ పట్టణం సమీపించి హాయికి ఉత్తరాన దిగారు. ఇప్పుడు వారికి, హాయికి మధ్య ఒక లోయ ఉంది. 12అతడు ఇంచుమించు ఐదు వేలమందిని పట్టణానికి పడమటి వైపున బేతేలుకు, హాయికి మధ్య పొంచి ఉండటానికి నియమించాడు. 13వారిని అలా ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలో దిగి అక్కడ బస చేశాడు.

14హాయి రాజు దాన్ని చూసి అతడూ, అతని ప్రజలంతా, త్వరపడి పెందలకడే లేచి మైదానం ఎదురుగా ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకు ముందు నిర్ణయించుకొన్న స్థలం లో యుద్ధం చేయడానికి బయలుదేరారు. తనను పట్టుకోడానికి వారు పట్టణానికి పడమటి వైపున పొంచి ఉన్న సంగతి అతడు తెలుసుకోలేక పోయాడు.

15యెహోషువ, ఇశ్రాయేలీయులందరూ వారి ముందు నిలవలేక ఓడిపోయినట్టు అరణ్యమార్గం వైపు పారిపోతుండగా 16వారిని ఆత్రుతగా తరమడానికి హాయిలో ఉన్న వారందరూ పోగై యెహోషువను తరుముతూ పట్టణానికి దూరంగా వెళ్లిపోయారు. 17ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లనివారు హాయిలో గాని, బేతేలులో గాని ఒక్కరూ మిగల్లేదు. వారు ద్వారం మూయకుండానే పట్టణాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్ళిపోయారు.

18అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “నీవు చేతిలో పట్టుకొన్న ఈటెను హాయి వైపు చాపు, పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తాను.” అప్పుడు యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఆ పట్టణం వైపు చాపాడు. 19అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటు వేసిన చోటనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలోకి చొచ్చుకుపోయి దాన్ని పట్టుకుని వెంటనే అప్పటికప్పుడే తగులబెట్టేశారు.

20హాయివారు వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ పట్టణం పొగ ఆకాశానికి ఎక్కుతూ ఉంది. అప్పుడు అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు యోధులు వెనక్కి తిరిగి తమను తరుముతున్న వారిమీద దాడిచేసేటప్పటికి ఈ వైపు గానీ, ఆ వైపు గానీ, ఎటూ పారిపోవడానికి వారికి వీలు లేకపోయింది. 21పొంచి ఉన్నవారు పట్టణాన్ని పట్టుకోవడం, పట్టణంలో పొగ పైకి రావడం యెహోషువ, ఇశ్రాయేలీయులంతా చూసినప్పుడు వారు హాయి వారిని హతం చేశారు.

22తక్కిన వారు పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చారు. అలా ఈ వైపు కొందరు ఆ వైపు కొందరు ఉండగా హాయివారు మధ్యలో చిక్కుకుపోవడం వల్ల ఇశ్రాయేలీయులు వారిని హతం చేశారు. వారిలో ఒక్కడూ మిగల్లేదు, ఒక్కడూ తప్పించుకోలేదు.

23వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరికి తీసుకువచ్చారు. 24ఎడారిలోను, పొలంలోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు కత్తివాత హతం కాకుండా మిగిలిన వాడొక్కడు కూడా లేకపోవడంతో చంపడం చాలించి అందరూ హాయికి తిరిగి వచ్చారు, హాయిని పూర్తిగా కత్తితో నిర్మూలం చేశారు.

25ఆ దినాన్న చనిపోయిన స్త్రీ పురుషులందరు మొత్తం పన్నెండు వేలమంది. 26యెహోషువ హాయి నివాసులనందరినీ నిర్మూలం చేసేవరకూ ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకోలేదు. 27యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులనూ సొమ్మునీ తమ కోసం పూర్తిగా దోచుకున్నారు.

28అలా యెహోషువ, హాయి ఎప్పటికీ పాడు దిబ్బగా ఉండాలని దాన్ని కాల్చివేశాడు, ఇప్పటికీ అది అలాగే ఉంది. 29యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకూ ఉరికొయ్య మీద వేలాడదీశాడు. పొద్దుగుంకుతున్నప్పుడు యెహోషువ ఆజ్ఞతో ప్రజలు అతని శవాన్ని మానుమీద నుండి దించి ఆ పట్టణ ద్వారం ముందు దాన్ని విసిరేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేశారు. అది నేటి వరకూ ఉంది.

ఏబాలు కొండ మీద బలిపీఠాన్ని తిరిగి స్థిరపరచడం

30మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసిన ప్రకారం 31యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్టు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామాన బలిపీఠాన్ని ఇనుప పనిముట్లు తగలని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించాడు. దాని మీద వారు యెహోవాకు దహన బలులనూ సమాధాన బలులనూ అర్పించారు. 32మోషే ఇశ్రాయేలీయులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రగ్రంథం ప్రతిని అతడు అక్కడ ఇశ్రాయేలీయుల సమక్షంలో ఆ రాళ్ల మీద రాయించాడు.

33అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించడానికి యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినట్టు జరగాలని, ఇశ్రాయేలీయులంతా వారి పెద్దలూ వారి నాయకులూ వారిలో పుట్టినవారూ, పరదేశులూ, వారి న్యాయాధిపతులూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులైన లేవీయుల ఎదుట ఆ మందసానికి ఈ వైపున, ఆ వైపున నిలబడ్డారు. వారిలో సగం మంది గెరిజీము కొండ ముందూ సగం మంది ఏబాలు కొండ ముందూ నిలబడ్డారు.

34యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ అంటే దాని దీవెన వచనాలనూ దాని శాప వచనాలనూ చదివి వినిపించాడు. స్త్రీలూ పిల్లలూ వారి మధ్య ఉన్న పరదేశులూ వింటూ ఉండగా 35యెహోషువ సర్వసమాజం ముందు మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవకుండా విడిచిపెట్టిన మాట ఒక్కటి కూడా లేదు.